శ్రీలంకలో ఆదివారం ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు వరుసగా ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐసిస్ ఈ పేలుళ్లకు పాల్పడిందన్న సమాచారంతో నగర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారన్న సమాచారంతో ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్లో తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అనుమానితులైన దంపతులను అరెస్టు చేశారు.
హైదరాబాద్ చాంద్రాయణ గుట్ట ప్రాంతానికి చెందిన అబ్దుల్బాసిత్ అనే వ్యక్తి ఐసిస్లో చేరాలనే లక్ష్యంతో ఆప్ఘనిస్థాన్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గత ఏడాది పోలీసులకు పట్టుబడ్డాడు. దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో వెలుగు చూడడమే పోలీసుల అప్రమత్తతకు కారణం. ఇక్కడ చాప కింద నీరులా ఉగ్రనీడలు విస్తరిస్తున్నాయనే అనుమానాలు బలంగా వినిపిస్తున్న క్రమంలో పలువురు అనుమానితులను ఎన్ఐఏ విచారిస్తోంది.