తెలుగు నెలల్లో వసంత రుతువుకు స్వాగతం చెబుతూ ఉత్సాహంగా జరుపుకొనే రంగుల పండుగ (ఫెస్టివల్ ఆఫ్ కలర్స్) హోలీ. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడాలు లేకుండా కులమతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ..
హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటిరోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు.
భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను ‘వసంతోత్సవం’ పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం.
పురాణాలు ఏం చెబుతున్నాయి..
హోలీ రోజు కామదహనం
సతీవియోగంతో విరాగిగా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీ దేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంలో ఉన్న శివునికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మథుడిని పరమేశ్వరుడి మీదకు పంపిస్తారు. అప్పుడు మన్మథుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవితో వివాహం జరిపిస్తారు. అనంతరం మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు.. అతడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు.
పతి వియోగంతో బాధపడుతున్న మన్మథుని సతి రతీదేవి శివుడిని వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు కాముని దహనం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి.
మంటల్లో హోళిక..
రాక్షస రాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మ వరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను, మునులను అనేక రకాలుగా హింసించేవాడు. అయితే అతని కుమారుడు ప్రహ్మాదుడు కూడా విష్ణు భక్తుడే. ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫలయత్నాలు చేస్తాడు. అప్పుడు తన సోదరి హోళికను ప్రహ్లాదుడిని చంపడానికి పురమాయిస్తాడు. హోళిక మంటలను రగిల్చి ఆ మంటల్లో ప్రహ్లాదుడిని తోసేస్తుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోళికను దహించివేస్తాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం రూపంలో మంటలు వేస్తారు.
రాధపై కృష్ణయ్య రంగుల వర్షం.
ద్వాపర యుగంలో రాధ తన కంటే అందంగా ఉందని.. తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు. అప్పుడు యశోద.. రాధ శరీరం నిండా రంగులు పూయమని కృష్ణయ్యకు ఉపాయం చెబుతుంది. తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు. దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది. అప్పటినుంచి అది ఒక వేడుకగా మారిపోయింది.
శాస్త్రీయ ప్రకారం..
శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం.