కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ రాహుల్ గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనే పార్టీకి ఓ అతిపెద్ద సమస్యని అభివర్ణించారు. రాహుల్ అన్ని విషయాల్లోనూ ఎదురు నిలవకుండా పారిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ ఎన్నిక ఈ నెలలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
రాహుల్ వైఖరితో పార్టీలో ఓ రకమైన శూన్యం ఏర్పడిందని, దాన్ని భర్తీ చేసేందుకు సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నా, కుదరడం లేదని అన్నారు. యూపీలోని 80 సీట్లలో కేవలం ఒకే ఒక్క సీటును కాంగ్రెస్ గెలుచుకోవడం, స్వయంగా రాహుల్ గాంధీ ఓడిపోవడం క్లిష్ట పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయని సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.