కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 48 ఏళ్ల తరువాత రాజమ్మ ఇంటికి చేరుకున్నారు. 1970, జూన్ 19. అప్పట్లో 23 సంవత్సరాల వయసులో ఉన్న రాజమ్మ అనే యువతి డిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో నర్స్ గా విధులు నిర్వహించేవారు. ఆ సమయంలో సోనియా గాంధీకి డెలివరీ చేసిన లేబర్ రూమ్ బృందంలో ఆమె కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ జన్మించిన వేళ, తొలిసారిగా ఎత్తుకున్నది ఆమె. నర్సుగా రిటైర్ అయిన తరువాత భర్తతో కలిసి కేరళలోని వయనాడ్ లో ఆమె నివశిస్తున్నారు.
ఇక తనను గెలిపించిన వయనాడ్ లో ప్రస్తుతం పర్యటిస్తున్న రాహుల్, రాజమ్మ ఇంటికి వెళ్లారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ పౌరసత్వంపై దేశమంతా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాజమ్మ మీడియా ముందుకు వచ్చి రాహుల్ ఢిల్లీలోనే జన్మించాడని అందుకు తానే సాక్ష్యమని వెల్లడించిన సంగతి తెలిసిందే.