జమ్మూకాశ్మీర్లోని పుల్వామా దాడిపై ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. భారత్ తమను అనవసరంగా నిందిస్తోందని అన్నారు.తాము కూడా ఉగ్రవాద బాధితులమేనని అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తులో భారత్కు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఇలాంటి దాడుల వల్ల పాకిస్థాన్ కు వచ్చే లాభం ఏమిటని ప్రశ్నించారు. తమ దేశానికి సౌదీఅరేబియా రాజు సల్మాన్ వస్తున్న సమయంలో ఇలాంటి పనులు తాము ఎందుకు చేస్తామని ప్రశ్నించారు.
తమ గడ్డపై ఉన్న ఏ వ్యక్తి కూడా హింసను కోరుకోడని ఇమ్రాన్ అన్నారు. పాక్ గడ్డపై ఉండి హింసకు పాల్పడేవారిని తాము ఉపేక్షించమని చెప్పారు. సరైన ఆధారాలు లేకుండానే పాకిస్థాన్ ను విమర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. దాడుల నెపంతో శాంతి చర్చలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. భారత ఉప ఖండంలో సుస్థిరత నెలకొనాల్సిన అవసరం ఉందని అన్నారు. కాశ్మీర్ సమస్యకు సైనిక చర్య సమాధానం కాదన్నారు. ఒకవేళ భారత్ దాడికి దిగితే తామూ ధీటుగా ఎదుర్కొంటామని ఇమ్రాన్ అన్నారు.