లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న మగాళ్లు మహిళలను కష్టపెట్టొద్దని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. వంటింటి వ్యవహారాల్లో పాలు పంచుకుని మగాళ్లు మమకారం చాటుకోవాలని నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. వంటావార్పులతో మహిళలను ఉక్కిరిబిక్కిరి చేయొద్దని, ఎందుకంటే ఇది విందు, వినోదాలకు సమయం కాదని పేర్కొన్నారు. మగాళ్లు ఇంట్లో కూర్చోవడం, మహిళలు మూడు నాలుగుసార్లు వంటింట్లో నలిగిపోవడం సరికాదన్నారు.
ఇంటిల్లిపాదీ ఆనందంగా గడపాల్సిన ఈ సమయంలో వారికి సాయం చేస్తూ చేదోడువాదోడుగా నిలవాలని కోరారు. వారిని వంటింటికే పరిమితం చేస్తే కుంగిపోతారని సీఎం అన్నారు. అదే జరిగితే వారితోపాటు దేశం కూడా కుంగిపోతుందని పేర్కొన్నారు. కాబట్టి మగాళ్లు ఓపిగ్గా మసలుకోవాలని, ఆహారాన్ని నియంత్రించుకోవాలని సూచించారు.