ఢిల్లీ నిజాముద్దీన్లోని మార్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో జనగామ జిల్లాకు చెందిన వారు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జనగామలో హైఅలర్ట్ నెలకొంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో నిజాముద్దీన్ ఘటన ప్రజలను కలవరపాటుకు గురిచేసింది. జనగామ జిల్లా కేంద్రంతోపాటు నర్మెట మండలం వెల్దండకు చెందిన ఐదుగురు ఈనెల 15న ఢిల్లీకి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నాక 17వ తేదీన విమానంలో హైదరాబాద్ మీదుగా స్వస్థలాలకు చేరుకున్నారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒకరు ప్రైవేట్ పని చేసుకునే వ్యక్తిగా అధికారులు గుర్తించారు.
. ఢిల్లీకి వెళ్లి వచ్చిన నాటి నుంచి వీరంతా హోం క్వారంటైన్లో ఉండకుండా, జనాల్లో కలిసి తిరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన మత ప్రార్ధనల్లో పాల్గొన్న కుటుంబాల వద్దకు వైద్యారోగ్యశాఖ తో పాటు పోలీసులు, రెవెన్యూ అధికారులు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఇందులో వెల్లండ గ్రామానికి చెందిన వ్యక్తితో పాటు ఆయన భార్య, కుమారుడిని రెస్క్యూ టీం పర్యవేక్షణలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. జనగామకు చెందిన ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి వారి కుటుంబీకులను హోం ఐసోలేషన్లోనే ఉంచారు.