నాలుగు రోజుల కిందట మహబూబాబాద్ కిడ్నాపైన 9 ఏళ్ల దీక్షిత్ రెడ్డిని.. కిడ్నాపర్లు అత్యంత కిరాతకంగా చంపేశారని పోలీసులు వెల్లడించడంతో.. బాలుడి కుటుంబం శోకసంద్రమైంది. బిడ్డ క్షేమంగా తిరిగొస్తాడని ఆశగా ఎదురుచూశానని… కనీసం చివరిసారి ఒడిలోకి తీసుకుని గుండెలకు హత్తుకునే వీలు కూడా లేకుండా చేశారని… దీక్షిత్ తల్లి వసంత కన్నీరుమున్నీరైంది. తన కొడుకును ఎలా చంపారో.. కిడ్నాపర్లను కూడా అలాగే చంపాలని ఆమె కోరుతోంది. ఆదివారం సాయంత్రం దీక్షిత్ను ఎత్తుకెళ్లిన నిందితుడు మంద సాగర్… కే సముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై తీసుకెళ్లి.. బాలుడి గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అదే రోజు రాత్రి దీక్షిత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి… 45 లక్షలిస్తే బిడ్డను వదిలేస్తానని చెప్పాడు. 48 గంటల తర్వాత మరోసారి ఫోన్ చేసి.. డబ్బు రెడీ చేస్తే.. ఎక్కడికి, ఎప్పుడు తీసుకురావాలో చెబుతానని చెప్పాడు.
బుధవారం ఫోన్ చేసి.. ఊళ్లోని మూడు కోట్ల సెంటర్కు డబ్బుతో రావాలని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే వీలైనంత డబ్బు సమకూర్చుకుని అక్కడికి వెళ్లి అర్ధరాత్రి వరకూ వేచిచూసినా.. కిడ్నాపర్ మాత్రం రాలేదు. మరోవైపు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసుల విచారణలో అనేక కోణాలు బయటపడుతున్నాయి. నిందితుడు మంద సాగర్ కు ఉన్న నేర చరిత్ర ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఆరేళ్ల పాటు పోలీసు వాహనానికి తాత్కాలిక డ్రైవర్ గా పనిచేసిన సాగర్… బాలుడు దీక్షిత్ తండ్రి రంజిత్ వద్ద డబ్బులు ఉన్నాయని అతడిని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. సాగర్ చదివింది 7వ తరగతి మాత్రమే… కానీ, టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకున్నాడు.. గతంలో ఇజ్రాయిల్ కంపెనీకి చెందిన ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకొని కాల్స్ ద్వారా ఒక యువతిని వేధించాడు.. అప్పుడు కూడా పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు..