భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తగా నిర్మిస్తున్నారు. జూలై 26న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. సౌత్లో మంచి హిట్ సాధించిన చిత్రాలు ఇప్పుడు వరుసగా హిందీలో రీమేక్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా “డియర్ కామ్రేడ్” చిత్రాన్ని బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల విజయ్ తో పాటు చిత్ర నిర్మాతలతో కలిసి చిత్రాన్ని వీక్షించిన ఆయన ఇదొక గొప్ప ప్రేమ కథ. మంచి సందేశం ఉంది. నటీనటులతో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి. ధర్మ ప్రొడక్షన్స్ సంస్థపై ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాననే విషయం తెలపడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అయితే హిందీ రీమేక్లో ప్రధానపాత్రలు ఎవరు పోషిస్తారు అనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ విషయంపై ఓ ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. “దఢఖ్” సినిమాలో జంటగా నటించిన ఇషాన్, జాన్వీ కపూర్ రీమేక్ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తారని సోషల్ మీడియాలో పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి. “దఢఖ్” చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి ప్రశంసలు లభించడంతో కరణ్ జోహార్ “డియర్ కామ్రేడ్” రీమేక్ చిత్రంలో వారిద్దరిని ఎంపిక చేశాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
previous post