ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒకటి నుంచి రెండు సీట్ల వరకు మాత్రమే వస్తాయని పలు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన నేత, విశాఖ లోక్ సభ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. విశాఖపట్నంలో ఈరోజు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ ఎగ్జిట్ పోల్స్ ను తాము పట్టించుకోబోనని స్పష్టం చేశారు.
ఎగ్జిట్ పోల్స్ ను చూసి ఆందోళన చెందకుండా ఈ నెల 23 వరకూ ఫలితాల కోసం వేచి ఉండాలని జనసేన కార్యకర్తలను కోరారు. మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం ద్వారా ప్రజల్లో అనవసరంగా ఉత్కంఠను కలిగిస్తున్నారని విమర్శించారు. తాము ప్రజల కోసమే పనిచేస్తున్నాం కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ప్రభావం తమపై పెద్దగా ఉండదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తాము నిత్యం ప్రజా సేవలో ఉంటామని లక్ష్మీనారాయణ తెలిపారు.