కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని ఉన్నారు. నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బ తిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను పరిశీలించారు సీఎం. భారీ వరదల వల్ల లంక భూములు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇరువైపులా తీవ్రంగా దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు సీఎం.
సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. భారీ వరదలు, వర్షాలు వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేయండి అని సీఎం ఆదేశించారు. వీలైనంత వేగంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే.. రైతులకు రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 5 నిత్యావసర సరుకులతో ఉచిత రేషన్ అందిస్తుంది ప్రభుత్వం. మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.