గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ అడవుల్లో ఒక్కసారిగా కాల్పులమోత మోగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్ల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. జిల్లాలోని మణగూరు మండలం బుడుగుల అటవీప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు పోలీసులకు నిఘా సమాచారం అందింది. దీంతో జిల్లాలోని బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి.
బడుగుల అటవీప్రాంతానికి రాగానే పోలీసులను గమనించిన మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో గుంటూరు రవి అనే మావోయిస్టు ప్రాణాలు కోల్పోగా, మిగిలినవారు కాల్పులు జరుపుతూ అడవుల్లోకి పారిపోయారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు.