ప్రభుత్వం ఖజానాలో నిధుల కొరత ఉన్నందున రైతు బంధు పథకాన్ని ఆలస్యంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైతు బంధు పథకాన్ని కాస్త ఆలస్యం చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆర్థికశాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖరీఫ్ మరియు రబీ సీజన్లకుగాను ప్రతి రైతుకు ఎకరాకు రూ.5000 ఇస్తూ కేసీఆర్ ప్రభుత్వం గతేడాది రైతు బంధు పథకం ప్రారంభించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రబీ ఖరీఫ్ సీజన్లకు రూ.12వేల కోట్లు బడ్జెట్ను కేటాయించింది. నిధుల కొరత కారణంగా ఈ సారి చెల్లింపుల్లో ఆలస్యమయ్యేలా కనిపిస్తోందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రం ఏర్పడినప్పుడే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ప్రస్తుతం నేతినిండా అప్పులు, ఖాళీగా ఉన్న ఖజానాతో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేని స్థాయిలో ఉన్నదంటే ఇది పరిపాలన లోపమా లేక ఆర్థిక వనరుల దుర్వినియోగమా అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఇలాగే కొనసాగితే మిగులు బడ్జెట్ రాష్ట్రం కాస్తా ఆర్థికంగా చితికిపోయిన స్థితికి దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.