పింఛన్ కోసం అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలు ఓపికతో వరుసలో నిలబడి చివరికి పింఛన్ అందుకునేప్పటికి ప్రాణం విడిచిన హృదయవిదారక ఘటన సోమవారం లక్కిరెడ్డిపల్లెలో చోటు చేసుకుంది. మండలంలో పందెళ్లపల్లె పంచాయతీలో పింఛన్లు, పసుపు-కుంకుమ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. షేక్ మాబున్ని అనే వృద్ధురాలు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ.. పెంచిన పింఛన్ను అందుకోవడానికి వచ్చింది. వరుసలో ఓపిగ్గా నిలబడి చివరికి ట్యాబ్లో ఫింగర్ వేస్తూ కుప్పకూలింది. వెంటనే అక్కడి ప్రజలంతా ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే వృద్ధురాలు చనిపోయింది.
ఇక విశాఖలో కూడా .. కడుపు మాడుతున్నా.. పింఛన్ వస్తుందన్న ఆశతో.. వృద్ధులు పడిగాపులు కాస్తున్న ఘటన విశాఖ సాగర్ నగర్లో చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు పింఛన్ కోసం వచ్చిన వృద్ధులు మధ్యాహ్నమైనప్పటికీ పింఛన్ అందక పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో.. జోడుగుళ్లపాలెంకి చెందిన పూడి దానయ్య అనే వృద్ధుడు ఎండదెబ్బకు సొమ్మసిల్లాడు. పింఛన్ల కోసం జనం బారులు తీరారు. సర్వర్లు డౌన్ అయ్యాయని అధికారులు చెప్పడంతో మధ్యాహ్నం 2 గంటలు కావస్తున్నా వృద్ధులు పింఛన్ అందక బాధపడుతున్నారు. సాగర్ నగర్ కమ్మునిటీ హెల్త్ సెంటర్ లో డ్వాక్రా మహిళలు, పింఛను కోసం వచ్చినవారూ పడిగాపులు కాస్తున్నారు. కనీస వసతులు లేని పరిస్థితుల్లో కడుపు మాడుతున్నా పింఛన్ వస్తుందన్న ఆశతో పండు ప్రాణాలు ఎదురుచూస్తున్నాయి.