telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

కోచ్ ల వార్షిక పారితోషకం.. కోట్లలోనే..

cricket coaches annual payments

క్రికెట్ ఆడే ఆటగాళ్లు వివిధ సిరీస్ లు, ఐపీఎల్ మ్యాచ్ లు ఆడుతూ కోట్లలో సంపాదించుకుంటారు. ఇంకా యాడ్స్ ద్వారా కూడా వారు సంపాదిస్తారు. అంటే దీనిని బట్టి వాళ్ళ సంపద కోట్లలో ఉంటుందని అర్ధం అవుతుంది. మరి కోచ్ ల విషయం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని ఉంటుంది కదా, వారికి పారితోషకం తక్కువేమి కాదు, ఏడాదికి కోట్లలో తీసుకుంటారు. ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు అనేది చూద్దాం..

బీసీసీఐ, భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ రవిశాస్త్రికి ప్రపంచంలోని అందరి కోచ్‌లకన్నా అధిక వార్షిక వేతనాన్ని చెల్లిస్తోంది. శాస్త్రి కాంట్రాక్టు 2019 వరల్డ్‌ కప్‌ వరకు ఉండగా.. ఆయన అందుకుంటున్న వార్షిక వేతనం అక్షరాల 1.17 మిలియన్‌ డాలర్లు. అంటే సుమారు రూ. 8.5 కోట్లు. రవిశాస్త్రి 1981 – 1992 మధ్య కాలంలో ఓపెనింగ్‌, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్‌గా భారత్‌ తరఫున ఆడారు. 2014-16 వరకు టీం ఇండియా డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించిన శాస్త్రి .. అప్పటి కోచ్‌ అనిల్‌ కుంబ్లే బాధ్యతల నుంచి తప్పుకోవడంతో, జులై 2017లో కోచ్‌ పదవిని స్వీకరించాడు.

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ డారెన్‌ లీమన్‌ క్లాసికల్‌ షాట్లతో క్రికెట్‌ ప్రేక్షకులను అలరించాడు. 2005లో కెరీర్‌ ముగించిన తర్వాత ఐపీఎల్‌లో కోచ్‌ అవతారమెత్తాడు. 2009-12 వరకు డెక్కన్‌ ఛార్జర్స్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు.. 2009 ఐపీఎల్‌ ట్రోఫీని గెలుచుకోవడంతో కోచ్‌గా అతని‌ పేరు మార్మోగింది. 2013 యాషెస్‌ సిరీస్‌కు మూడు వారాల ముందు కంగారూల జట్టు కోచ్‌గా ఎంపికయ్యాడు. లీమన్‌ హయాంలో ఆ జట్టు 2015 వరల్డ్‌ కప్‌ కైవసం చేసుకోవడంతో పాటు, ఇటీవలి యాషెస్‌ సిరీస్‌నూ గెలుచుకుంది. గత సంవత్సరం మార్చిలో బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో లీమన్‌ తప్పుకునే నాటికి వార్షిక వేతనంగా సుమారు రూ. 4 కోట్లు తీసుకునేవాడు.

ఇంగ్లండ్‌ జట్టులో చురుకైన ఫీల్డర్‌, మిడిల్‌ ఓవర్‌లలో హిట్టర్‌గా పేరొందిన ట్రెవర్‌ బేలిస్‌ మొదట్లో న్యూ సౌత్‌వేల్స్‌ తరఫున సక్సెస్‌పుల్‌ కోచ్‌గా గుర్తింపు పొందాడు. అనంతరం శ్రీలంక జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేశాడు. ట్రెవర్‌ హయాంలో లంక జట్టు టెస్ట్‌ క్రికెట్‌ ర్యాంకింగ్‌లో రెండో స్థానానికి చేరుకోవడంతో పాటు, 2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌కి వెళ్లింది. ఆ తర్వాత ఐపీఎల్‌లో కలకత్తా నైట్‌ రైడర్స్‌ కోచ్‌గా కూడా వ్యవహరించిన ట్రెవర్‌.. 2015 మే నుంచి ఇంగ్లండ్‌ జట్టు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం ట్రెవర్‌ ఏడాదికి రూ. 3.75 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు.

మైక్‌ హెస్సన్‌ సుదీర్ఘంగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ఆతని వార్షిక పారితోషికం రూ. 1.8 కోట్లు. 22 ఏళ్ల వయసులోనే కోచ్‌ అవతారం ఎత్తిన మైక్‌ మొదట్లో ఒటాగో ఏడు సంవత్సరాల పాటు డైరెక్టర్‌గా ఉన్నాడు. అనంతరం 2003లో అసిస్టెంట్‌ కోచ్‌గా ప్రమోట్‌ అయ్యాడు. ఆ తర్వాత 2012లో న్యూజిలాండ్‌ కోచ్‌ను చేసింది. జాన్‌రైట్‌ తప్పుకున్న తర్వాత బ్లాక్‌ క్యాప్స్‌కు కోచ్‌గా మారిన మైక్‌ జట్టకు చక్కని విజయాలు అందించాడు. మైక్‌ కోచ్‌గా వ్యవహరించిన 51 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. 107 వన్డే మ్యాచ్‌లకు 63 గెలుపొందింది.

దక్షిణాఫ్రికాకు చెందిన మికీ ఆర్థర్‌ తన క్రికెట్‌ కెరీర్‌లో కేవలం 6,557 పరుగులే చేశాడు. అయితేనేం కోచ్‌గా అదరగొడుతున్నాడు. సొంత దేశంలో డొమెస్టిక్‌ క్రికెట్‌లో కోచ్‌గా ప్రయాణం ప్రారంభించిన మికీ 2005లో జాతీయ జట్టుకు కోచ్‌ అయ్యాడు. జట్టు కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌, మికీ మధ్య సమన్వయం కుదరడంతో ఆ జట్టు వరుస విజయాలతో అదరగొట్టింది. 2010లో దక్షిణాఫ్రికా కోచ్‌గా పదవికాలం ముగిసిన తర్వాత కొంతకాలం ఆస్ట్రేలియాలో టీ-20 ప్రాంఛైజీలకు కోచ్‌గా సేవలందించారు. 2016 మేలో పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆయన హయాంలో పాక్‌ 2017లో ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మికీ రూ. 1.57 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నాడు.

Related posts