కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణలో సీఎం కేసీఆర్ మే 29 వరకు లాక్ డౌన్ను పొడిగించారు. అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ కొన్ని సడలింపులను ఇచ్చారు. ఇందులో భాగంగానే తెలంగాణలో లాక్ డౌన్ మినహాయింపులు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. అటు జోన్లతో సంబంధం లేకుండానే రాష్ట్రమంతా రాత్రి 7 గంటల తర్వాత కర్ఫ్యూ కొనసాగనుంది. రెడ్ జోన్లలో కఠినతరమైన నిబంధనలను అమలు చేయనున్నారు. ఇక గర్భిణీలను, వృద్దులను, చిన్నారులు ఇళ్ళ నుంచి బయటికి రావద్దని సూచించారు.
కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా అన్ని చోట్లా మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లతో పాటుగా రెడ్ జోన్లలోనూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు పని చేస్తాయి. అటు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్న గ్రామీణ, మండల ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలు కొనసాగనుండగా.. మున్సిపాలిటీలలో మాత్రం లాటరీ పద్దతిలో 50 శాతం దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతిచ్చారు. ఇక ఇవన్నీ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరుచుకోనున్నాయి.