మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీకి, ఎన్డీయే కూటమికి ఘనవిజయం సాధించింది. దీంతో నరేంద్ర మోదీ ఈ సాయంత్రం రాష్ట్రపతిభవన్ లో రెండవసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానిగా మోదీతో ప్రమాణం చదివించారు. నరేంద్ర దామోదర్ దాస్ అను నేను అంటూ మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ ప్రమాణ పత్రం చదువుతున్న సమయంలో బోలో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో రాష్ట్రపతి భవన్ హోరెత్తింది.
మోదీ అనంతరం కేంద్రమంత్రిగా రాజ్ నాథ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆపై అమిత్ షాను రాష్ట్రపతి ఆహ్వానించారు. అమిత్ షా కేంద్ర క్యాబినెట్ లో అడుగుపెట్టడం ఇదే ప్రథమం. మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి బిమ్ స్టెక్ దేశాధినేతలతో పాటు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీ తారలు హాజరయ్యారు.