జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ నాయకుల అరెస్టుపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేస్తోందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు గులాం అహ్మద్ మిర్, అధికార ప్రతినిధి రవీందర్ శర్మని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపధ్యంలో ట్విట్టర్లో స్పందించారు.
శనివారం ఆంక్షల్ని సడలించనున్నామని జమ్మూకశ్మీర్ రాష్ట్ర అధికారులు ప్రకటించిన కొద్ది సమయంలోనే ఈ ఇద్దరు నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిర్ణయంపై రాహుల్ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ నేతల అరెస్ట్ ను ఖండిస్తున్నాను. ఓ జాతీయ పార్టీ నాయకుల పట్ల ఇలాగేనా వ్యవహరించేది. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో ప్రజాస్వామ్య వ్యవస్థనే దెబ్బకొడుతున్నారని రాహుల్ ట్విట్టర్లో విమర్శించారు.