నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. దేశంలో చేపట్టిన ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’కు గానూ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఆయనకు ‘గ్లోబల్ గోల్ కీపర్’ అవార్డు ప్రదానం చేసింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చేతుల మీదుగా ప్రధాని మోదీ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇది తనకు ఒక్కడికే దక్కిన గౌరవం కాదని యావత్ భారతీయులందరిదనీ పేర్కొన్నారు. ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ విజయవంతం కావడానికి కారణమైన యావత్ భారతీయులందరికీ దక్కిన గౌరవం ఇది. మహాత్మా గాంధీ 150వ జయంతి జరుపుకోనున్న ఏడాదిలోనే నాకు ఈ అవార్డు వచ్చింది. వ్యక్తిగతంగా ఇది నాకు చాలా ముఖ్యమైంది. గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 11 కోట్ల మరుగుదొడ్లు కట్టించాం.
ఈ పథకం వల్ల ఎవరికైనా లాభం చేకూరింది అంటే అది ఖచ్చితంగా పేద మహిళలకే. ఇన్ని రోజులు మహిళలు, ఆడకూతుళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని కారణంగా బడి మానేసిన బాలికలు కూడా ఉన్నారు. ఈ సమస్యను ఛేదించడం మా ప్రభుత్వం బాధ్యత. మేం దీన్ని నిజాయతీగా అధిగమించగలిగాం. ఫలితంగా మహాత్మా గాంధీ కలలు కన్న పరిశుభ్రమైన భారత్ను అందించే దిశగా అడుగులు వేస్తున్నాం’ అని తెలిపారు.