ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసేందుకు గ్రీన్ సిగ్నలిచ్చారు. జగన్ అధ్యక్షతన నిర్వహించిన తొలి కేబినెట్లోనే విలీనానికి మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. అందులోభాగంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్ అంజనేయరెడ్డి నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా ఆర్అండ్బీ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, ఆర్థికశాఖ కార్యదర్శి, ఆర్టీసీ ఈడీ, రిటైర్డ్ ఇంజినీర్ సుదర్శనాన్ని ఎన్నుకున్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం.. ఆర్టీసీ కార్మికుల ఆర్థిక సమస్యల పరిష్కారంపై కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల సీఎం జగన్ ఆధ్వర్యంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. సుమారు ఐదున్నర గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.