నల్లొండ జిల్లా హుజూర్నగర్ ఉపఎన్నిక ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించగా.. కాంగ్రెస్ మాత్రం ఎప్పటిలాగానే అభ్యర్థి విషయంలో తర్జనభర్జనలు చేస్తూనే ఉంది. మరోపక్క బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ ప్రకటించింది. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్ళాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చూశాక తమ అభ్యర్థిని ప్రకటించాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు నేతలు చెబుతున్నారు. అంతేకాదు.. టీఆర్ఎస్, కాంగ్రెస్లో అసంతృప్తులు కాషాయ కండువా కప్పుకుంటారని అప్పుడు తమకు మరింత బలం పెరుగుతుందని కమలనాథులు మీడియాకు వెల్లడించారు.
బీజేపీ అభ్యర్థి ప్రకటనలో వ్యూహ ధోరణిలో ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హుజూర్ నగర్ అభ్యర్థిగా భాగ్యారెడ్డి బరిలోకి దిగారు. అయితే ముందస్తు ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 1555 కాగా.. నోటాకు 1621 ఓట్లు పోలయ్యాయి. గతంతో పోల్చితే.. పరిస్థితుల్లో మార్పు వచ్చిందని..అందుకే ఈ ఉపఎన్నికలో పోటీ చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు బీజేపీని గుర్తించారని కాషాయ నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ పాలనలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి: సీఎల్పీ భట్టి