దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ను పొడిగించే అవకాశాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాలకు పలు సూచనలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ లాక్డౌన్ను ఎత్తి వేయకపోతే పేదల పేదలు పడుతున్న ఇబ్బందుల పట్ల దృష్టిపెట్టాలన్నారు. వారిని ఆదుకునేందుకు పేదల ఖాతాల్లో రూ.5,000 జమచేయాలని చెప్పారు.
సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న కరోనా జిహాద్పై ఒవైసీ మాట్లాడుతూ… ‘ఇటువంటి పనులకు పాల్పడుతున్న వారు దేశాన్ని బలపర్చట్లేదు. జనవరి 1 నుంచి మార్చి 15 వరకు దేశానికి 15 లక్షల మంది విదేశాల నుంచి వచ్చారు. కానీ, తబ్గిగీ జమాత్ను మాత్రమే ఎత్తి చూపెడుతున్నారు. దేశంలో మార్చి 3 నుంచి స్క్రీనింగ్ ప్రారంభించారు. దీనికి బాధ్యత ఎవరిది?’ అని ప్రశ్నించారు.
ఇతర రాష్ట్రాలకు వలసలు వచ్చిన ప్రతి ముగ్గురిలో ఒకరికి కరోనా సోకి ఉండొచ్చని, వారు గ్రామాలకు వెళితే అక్కడా విస్తరిస్తుందన్నారు. సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానిలో నిజంలేదన్నారు. ఆరు లక్షల మందిని శిబిరాల్లో ఉంచామని కేంద్ర ప్రభుత్వం అంటోందని, మరి అక్కడ సామాజిక దూరం ఎలా పాటిస్తారు? అని ప్రశ్నించారు. ఇది ద్వేషాన్ని పెంచేందుకు చేస్తోన్న కుట్ర అని ఆయన పేర్కొన్నారు.