ఏపీ సీఎం జగన్ చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ఈరోజు ప్రజావేదికలో కలెక్టర్లతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టో అమలు విషయంలో ముఖ్యమంత్రి జగన్ చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతీ పథకాన్ని కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అమలు అయ్యేలా చూడాలన్నారు.
జిల్లా కలెక్టర్లు ప్రతీరోజూ గ్రీవెన్స్ సెల్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని కోరారు. ప్రతివారం తాను కూడా ఈ విషయమై కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. అధికారులంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. గంటలు గంటలు సమీక్షలు పెట్టకుండా సృజనాత్మకంగా ఆలోచించడానికి అధికారులకు మరింత సమయం ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే అవసరమైనంత మేరకు మాత్రమే షెడ్యూల్ ను ముఖ్యమంత్రి నిర్దేశించారని చెప్పారు.