ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జర్మనీలపై కరోనా తీవ్రరూపం దాల్చింది. దీంతో ఫ్రాన్స్ లో గత 24 గంటల్లో మరో 21 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 148కి పెరిగింది. ఇదే సమయంలో 1,210 కొత్త కేసులు నమోదయ్యాయి. నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ తన దేశ పౌరులకు కీలక సూచనలు చేశారు.పౌరుల కదలికలపై కనీసం మరో 15 రోజులు తీవ్ర ఆంక్షలు ఉంటాయని ఆయన చెప్పారు.
ఇతరులను కలవడాన్ని ప్రతి ఒక్కరూ పూర్తిగా తగ్గించుకోవాలని హెచ్చరించారు. యూరోపియన్ యూనియన్ సరిహద్దులను 30 రోజుల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించారు.ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోకుండా వారాంతంలో చాలా మంది గుంపులుగా గడపారని మాక్రాన్ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య అధికారుల హెచ్చరికలను కూడా కాదని… పార్కులు, మార్కెట్లు, రెస్టారెంట్లు, బార్లలో గడిపారని తెలిపారు. కొందరు చేసే ఇలాంటి పనుల వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి పనులను కొనసాగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.