మరోసారి నగరాన్ని వానలు ముంచెత్తాయి. కేవవం రెండు గంటల పాటు కురిసిన అతి భారీ వర్షానికి ముంబై వీధులు మరోసారి సముద్రాన్ని తలపించాయి. దీంతో ఒక్కసారిగా ముంబై నగరం స్తంభించింది. నిన్న ఉదయం 8గంటల .30నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు 789 మిల్లీ మీటర్ల రికార్డు వర్షపాతం నమోదైందని స్కైమేట్ అంచనా వేసింది. రెండు గంటలపాటు ఏకధాటిగా కుండపోత వర్షం కురవడంతో ముంబై నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
గంటలపాటు ట్రాఫిక్ స్తంభించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో నగరవాసులు ట్రాఫిక్లో చిక్కుకుపోయి ప్రత్యక్ష నరకాన్ని చూశారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు గంటలు ఆలస్యంగా ఆఫీసులకు చేరుకున్నారు. రాత్రి కూడా మరోసారి కుండపోత వర్షం కురవడంతో నగరవీధులన్నీ వరదతో పోటెత్తాయి. మరోసారి రాత్రి ట్రాఫిక్ స్తంభించడంతో ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.
పూణె తీరప్రాంత కొంకణి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజా వర్షాల కారణంగా అంధేరీ ఈస్ట్లో గోడ కూలిన ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే మరోవైపు రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. అంతేకాదు రెడ్ అలర్ట్ను కూడా ప్రకటించారు. ముఖ్యంగా రాయఘడ్, థానే, పాలఘర్ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అతి భారీ వర్షాలకు తోడు.. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ అలల తాకిడి ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే శుక్రవారం వరకు అరేబియా సముద్రంలో అడుగు పెట్టవద్దని మత్స్యకారులను వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని గంటలపాటు విమానాల రాకపోకలను ఎయిర్పోర్ట్ అధికారులు నిలిపివేశారు. దీంతీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.