సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాను తీస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్స్ ఇప్పటికే ప్రకంపనలు రేపుతున్నాయి. ఇటీవలే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. తాను రాజకీయ ప్రయోజనం కోసం ఈ సినిమాను తీయట్లేదని, నన్ను చంపినా ఈ సినిమా విడుదల మాత్రం ఆగదని స్పష్టం చేశాడు వర్మ. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండడంతో “లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదలకు బ్రేక్ పడేలా కన్పిస్తోంది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వం కొత్త పథకాలు చేపట్టకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్ కుమార్ సూచించారు. మంత్రులు అధికారిక పర్యటనలు చేయరాదన్నారు. హోర్డింగులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడపత్రాలను కూడా తొలగించాలని ఆదేశించారు. ఇక ఇప్పుడు వర్మ తెరకెక్కిస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్”లో ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన సన్నివేశాలు, వ్యాఖ్యలు ఉన్నాయి. ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ సినిమా వల్ల ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉండడమే కాకుండా… ఎన్నికల నియమావళికి ఇది విరుద్ధం కూడా. కాబట్టి ఈ సినిమాకు బ్రేకులు పడే అవకాశం కన్పిస్తోంది.