దిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఆడి ఐపీఎల్ 12వ సీజన్లో రెండో క్వాలిఫయర్కు అర్హత సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో తిరుగులేని విజయం సాధించింది. చెన్నైని ఢీకొట్టేందుకు సిద్ధమైంది. రిషభ్ పంత్ (49; 21 బంతుల్లో 2×4, 5×6), ఓపెనర్ పృథ్వీషా (56; 38 బంతుల్లో 6×4, 2×6) చెలరేగడంతో హైదరాబాద్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ 8 వికెట్లు నష్టపోయి ఛేదించింది.
ఆరంభం నుండి దిల్లీ ఛేదన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పృథ్వీషా అర్ధశతకంతో చెలరేగడంతో 7 ఓవర్లకు 57 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (17; 16 బంతుల్లో 3×4) మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్(8) సైతం విఫలమ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పంత్ ఆది నుంచి ఆచూతూచి ఆడాడు. అనువైన సమయం కోసం ఎదురుచూశాడు. మరోవైపు షా, మన్రో (14), అక్షర్ పటేల్ (0), రూథర్ఫర్డ్ ఔటైనా సహనం వహించాడు. అయితే రన్రేట్ మరీ తగ్గకుండా చూసుకున్నాడు. బాసిల్ థంపి వేసిన 18వ ఓవర్ను పంత్ లక్ష్యంగా ఎంచుకున్నాడు. వరుసగా 4, 6, 4, 6తో చెలరేగాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 12గా మారింది.
19వ ఓవర్లో రూథర్ఫర్డ్, పంత్ ఔటవ్వడంతో దిల్లీ చివరి 6 బంతుల్లో 5 పరుగులు చేయాల్సి వచ్చింది. ఖలీల్ వేసిన 19.4వ బంతికి అమిత్మిశ్రా అబ్స్ట్రక్టివ్ ఫీల్డ్ రూపంలో వెనుదిరగడంతో ఉత్కంఠ పెరిగింది. ఐదో బంతికి కీమోపాల్ బౌండరీ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీనితో రేపు చెన్నైతో తలపడి, ఫైనల్ కు వెళుతుందా .. అని దిల్లీ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆరంభంలో బాగా ఆడినా, ప్రస్తుతం తడబడుతున్న చెన్నై రేపటి ఆట తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయో .. అంటూ ఆ టీం పై కూడా ఉత్కంఠ నెలకొన్న విషయం వాస్తవం. ఈ రెంటిలో ఏది గెలిస్తే, ఆ టీం ముంబై తో తలపడనుంది.