ఈ నెల 9 నుండి ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. అయితే ఈసారి ఈ లీగ్ ను భారత్ లోనే నిర్వహించాలని నిర్ణయిచుకున్న బీసీసీఐకి తాజాగా గట్టి షాక్ తగిలింది. కరోనా నేపథ్యంలో బోర్డు 6 నగరాలను షార్ట్ లిస్ట్ చేయగా.. అందులో ముంబై, వాంఖడే మైదానంలో మ్యాచ్ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా అక్కడ మైదాన సిబ్బందిలో 8 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. కరోనా వైరస్ సోకిన వారందరిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. దాంతో ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న లీగ్ మ్యాచ్ను నిర్వహించాలా? వద్దా? అనే దానిపై బీసీసీఐ తర్జన భర్జన పడుతోంది. మరోవైపు మహారాష్ట్ర ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉంది. ఈ క్రమంలో ఇక్కడ మ్యాచ్లు నిర్వహించి రిస్క్ తీసుకోవడం అవసరమనే భావనలో బోర్డు వర్గాలున్నట్లు తెలుస్తోంది. ముంబై వేదికగా జరిగే మ్యాచ్లను వేరే నగరానికి తరలిస్తే ఎలా ఉంటుందని సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దేశంలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉండడంతో ఈసారి ఐపీఎల్ సీజన్ను 6 వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా ఉన్నాయి.
previous post