పోలీసుల దృష్టిలో ఎవరైనా ఒకటేనని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బొత్స ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళుతుంటే ఎవరి వాహనాలనైనా ఆపుతారని చెప్పారు. అది తన వాహనమైనా, పవన్ కల్యాణ్ వాహనమైనా ఒకటేనని ఏపీ వ్యాఖ్యానించారు. తన కారును ఆపారని పవన్ కల్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ సహనం కోల్పోతే ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుందన్నారు. సినిమాల్లో మాదిరిగా ఘీంకారాలు చేస్తే సహించేందుకు ఎవరూ సిద్ధంగా లేరని నిప్పులు చెరిగారు. ఇసుక విధానంపై పవన్ విమర్శలు అర్థరహితమని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఆయన చదువుతున్నారని ఎద్దేవా చేశారు. ఇసుకను ఇప్పుడు డోర్ డెలివరీ చేస్తున్నామని చెప్పారు.
తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టిందని అన్నారు. రూ. 1.10 లక్షల కోట్లతో ఒకే ప్రాంతంలో రాజధాని నిర్మించాలని భావించడం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి, రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యతలు ఉన్నాయని, కడపలో ఉక్కు కర్మాగారాన్ని కూడా పూర్తి చేయాల్సివుందని చెప్పారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడే చంద్రబాబులా తాము లేమని విమర్శలు గుప్పించారు.