2019 వన్డే ప్రపంచకప్కు అంబటి రాయుడ్ని పక్కన పెట్టిన భారత సెలెక్టర్లు.. బ్యాటింగ్ ఆర్డర్లో నెం.4 స్థానం కోసం విజయ్ శంకర్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రాయుడికి బదులుగా శంకర్ను ఎంపికచేయడంపై అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇస్తూ ”రాయుడితో పోలిస్తే విజయ్ శంకర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రూపంలో టీమ్కి మూడు కోణాల్లో ఉపయోగపడతాడు. అతను త్రీడీ ప్లేయర్” అని చెప్పుకొచ్చాడు. దాంతో.. అంబటి రాయుడు ‘వరల్డ్కప్ని చూసేందుకు ఇప్పుడే కొత్త త్రీడీ గ్లాస్లను ఆర్డర్ చేశాను’అని సెటైరికల్గా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగగా.. ఇప్పటికీ విజయ్ శంకర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ ‘త్రీడీ’ అంశం తెరపైకి వస్తోంది. దీనిపై శంకర్ స్పందిస్తూ..‘త్రీడీ పేరుతో నాకెలాంటి సంబంధం లేదు. ప్రపంచకప్ సమయంలో అభిమానులు నా పేరు ముందు ‘త్రీడీ’ అని తగిలించి వైరల్ చేశారు. ప్రపంచకప్లో మూడు మ్యాచ్లు ఆడా. మెరుగైన ప్రదర్శనే చేశా. నన్ను ప్రతిసారీ రాయుడితో పోలుస్తున్నారు. కానీ నేను ఆడిన బ్యాటింగ్ ఆర్డర్లు, పరిస్థితులు చాలా భిన్నం. ఎవరికీ ఇవేం పట్టవు” అంటూ ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకర్ అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్లోనూ విజయ్ శంకర్ పేలవ ప్రదర్శన కొనసాగింది. దాంతో అభిమానులు అతన్ని సోషల్ మీడియా వేదికగా ఉతికారేశారు.
కశ్మీర్ విభజనపై కమల్హాసన్ సంచలన వ్యాఖ్యలు