లాక్ డౌన్ నిబంధనలు సామాన్యులకేనా అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను ఎత్తిపోతలు చేసే కార్యక్రమంలో సీఎం కేసీఆర్, చిన్నజీయర్ స్వామి, మంత్రులు, అధికారులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంపై ఉత్తమ్ ధ్వజమెత్తారు. కేసీఆర్, మంత్రులు వందలాది మంది మధ్య ఉండి కూడా ముఖాలకు మాస్కులు ధరించలేదని అన్నారు.
కనీసం భౌతికదూరం పాటించలేదని విమర్శించారు. “స్వయంగా కేసీఆరే కరోనా లాక్ డౌన్ రూల్స్ రూపొందించారు, పెళ్లికి 20 మంది మించకూడదని, అంత్యక్రియల్లో 10 మంది కంటే ఎక్కువమంది పాల్గొనరాదని తెలిపారు. మాస్కులు ధరించకపోతే రూ.1000 జరిమానా విధిస్తాం అన్నారు. కేసీఆర్ ఏమైనా చట్టానికి అతీతుడా?” అంటూ ఉత్తమ్ మండిపడ్డారు.