ఖమ్మం లోక్ సభ ఎన్నికలలో చారిత్రాత్మక తీర్పు రాబోతోందని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పట్ల అన్ని వర్గాల ప్రజలూ వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. లోక్సభ ఎన్నికల ఫలితాలతో అది నిరూపితమవుతుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తనను ఓడించేందుకు టీఆర్ఎస్ పెద్దఎత్తున డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించారు. ధన రాజకీయం కంటే ప్రజా రాజకీయం వైపు ఖమ్మం ప్రజలు మొగ్గు చూపారని తెలిపారు. జిల్లా ప్రజలు డబ్బు రాజకీయాలకు, పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని, తనను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని ఆమె జోస్యం చెప్పారు. తనను గెలిపించేందుకు కృషి చేసిన కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.