ఆర్టీసీ అర్థిక పరిస్థితి బాగాలేనందున కార్మికులకు ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చలేమని ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ తేల్చిచెప్పారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై శనివారం హైకోర్టుకు సునీల్ శర్మ ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు తమ సొంత ఉనికి కోసం సమ్మె చేస్తున్నారని, అలాంటి సమ్మెను అక్రమమైనదిగా ప్రకటించాలని అఫిడవిట్లో కోరారు. ఇక కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని సమ్మె కారణంగా ఇప్పటివరకు ఆర్టీసీ కార్పొరేషన్ 44 శాతం నష్టపోయిందని కోర్టుకు తెలిపారు.
కొంతమంది యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం మొత్తం టీఎస్ ఆర్టీసీనే నష్టాల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లో నెట్టేందుకు యూనియన్ నేతలు పనికట్టుకున్నారని దుయ్యబట్టారు. పరిస్థితి చేయి దాటిపోతోందని, ఇప్పటికైనా సమ్మెను ఇల్లీగల్గా ప్రకటించాలని మరోసారి కోరుతున్నట్లు అఫిడవిట్లో సునీల్ శర్మ పేర్కొన్నారు.