ఏపీ రవాణా శాఖ మారుతి సుజుకీతో భారీ ఒప్పందం చేసుకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా మారనుంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని డ్రైవింగ్ పరీక్షల్లో ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వ రవాణా విభాగం, దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) మధ్య ఒక కీలక అంగీకార ఒప్పందం (MoU) కుదిరింది.
దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ (ADTT) ఏర్పాటు చేయనున్నారు.
తొలి దశలో రాష్ట్రంలోని ఏలూరు, ఒంగోలు, విజయనగరం మరియు అనకాపల్లి ప్రాంతాల్లో ఈ అత్యాధునిక టెస్టింగ్ ట్రాక్లు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ట్రాక్ల నిర్వహణ మరియు సాంకేతిక పర్యవేక్షణను మారుతి సుజుకీ సంస్థ మూడు సంవత్సరాల పాటు చేపట్టనుంది.
సాంకేతికతతో పారదర్శకత: సాధారణంగా డ్రైవింగ్ టెస్టుల్లో ఉండే మానవ జోక్యాన్ని ఈ వ్యవస్థ పూర్తిగా తొలగిస్తుంది. ఈ ట్రాక్లలో కింది టెక్నాలజీలను ఉపయోగించనున్నారు:
హై-డెఫినిషన్ (HD) కెమెరాలు – అభ్యర్థి డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రతి అంగుళం పర్యవేక్షిస్తాయి. RFID సెన్సర్లు – వాహనం కదలికలను సెన్సర్ల ద్వారా గుర్తిస్తాయి.
రియల్ టైమ్ అనలిటిక్స్ – పరీక్ష పూర్తయిన వెంటనే ఫలితాలను విశ్లేషించి అందిస్తాయి.
ఈ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు నిష్పాక్షికంగా జరుగుతాయి. నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేసిన వారికి మాత్రమే లైసెన్స్ లభిస్తుంది.
మారుతి సుజుకీ తన కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ ట్రాక్లను ఆధునీకరించి, సాంకేతికతను జోడించి ప్రభుత్వానికి సహకారం అందించనుంది.

