సాయిథరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో సినిమా రంగ సమస్యలను ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇటు సినిమా ఇండస్ట్రీలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. సినిమా ఫంక్షన్ కాస్తా… పొలిటికల్ సభగా మారిపోయింది. ఆ సభలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు.
దీనిపై పేర్ని నానితోపాటు పలువురు వైసీపీ మంత్రులు పవన్పై ఒంటికాలిపై లేచారు. ముఖ్యంగా పేర్ని నాని ఇంచ్ టూ ఇంచ్ పంచ్ టూ పంచ్ హైవోల్టేజ్ కౌంటర్లు వేశారు. దీంతో పవన్ కూడా ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. పవన్ వర్సెస్ వైసీపీ నేతల మధ్య జరుగుతున్న క్రమంలో నటుడు, నిర్మాత, దర్శకుడు పోసాని కృష్టమురళి ఎంట్రీ ఇచ్చాడు..తన దైన పదజాలంతో పవన్పై విమర్శలు గుప్పించారు. ఈ మాటలు కాస్తా యవ్వరం చేతల వరకు వచ్చింది.
అయితే ఈ వివాదంలో కొత్త ట్విస్ట్ మొదలైంది. పవన్, ఏపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సమయంలోనే మచిలీపట్నంలో ఉన్న మంత్రి పేర్ని నానిని కొంత మంది సినీ పరిశ్రమ నిర్మాతలు కలవటం సంచలనం కలిగిస్తుంది. ఈ వివాదం ఎక్కడకి దారి తీస్తుందోనని నిర్మాత దిల్ రాజు సారథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ ఏర్రేని నవీన్, రవి శంకర్ ప్రసాద్, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, అల్లు అర్జున్కు సమీప బంధువు మెగా కాంఫౌడ్లో ఉన్న బన్నీ వాసు ఈ రోజు మచిలీపట్నంలో ఉన్న పేర్ని నాని ఇంట్లో సమావేశం అయ్యారు.
ఈ వివాదం ముదిరితే సినిమా రంగానికి తీరని నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే నిర్మాత అల్లు అరవింద్ వెళ్ళకుండా..ఆయన తరుపున బన్నీ వాసుకి పంపించినట్టు తెలుస్తోంది. అలాగే రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ మాట్లాడిన మాటలు దిల్రాజు కాస్త అసహానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దిల్రాజు కేవలం పవన్తో మాత్రమే సినిమాలు తియ్యడం లేదని ఇతర హీరోలతో కూడా సినిమాలు తీస్తున్నాడు కాబట్టి ఏపీలో తన సినిమాలు విడుదల కాకపోతే చాలా నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో ముందుగానే అప్రమత్తమైన దిల్రాజు పేర్ని నానితో సమావేశమయ్యారు.
అయితే ఈ సమావేశంలో ఏం చర్చించారో ఇంకా తెలియాల్సింది ఉంది. ఏది ఏమైనా పవన్ వర్సెస్ వైసీపీ వివాదం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి దగ్గరకు నిర్మాతల బృందం వెళ్లడం చర్చనీయాంశంగా ఉంది.