ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య తీర్చేందుకు కృషి చేస్తామని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. రామాయపట్నం పోర్టు, దొనకొండ పారిశ్రామిక కారిడార్, నిమ్జ్ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఈ జిల్లాలో తాగునీటి సమస్య ఉందన్నారు.
ఒంగోలు, మార్కాపురంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని, ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో తాగునీటి సమస్య ఉండదని అన్నారు. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.