తెలంగాణ ఇంటర్బోర్డు విజ్ఞప్తి మేరకు ఏపీ ఎంసెట్ ఫలితాలు వాయిదా వేశారు. ఈ నెల 18న విడుదల చేయాల్సిన ఏపీ ఎంసెట్-2019 ఫలితాలను వాయిదా పడ్డాయి. తెలంగాణ ఇంటర్బోర్డు విన్నపం, విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎంసెట్ చైర్మన్, జేఎన్టీయూకే వీసీ, ప్రొఫెసర్ రామలింగరాజు, ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ హైకోర్టు సూచన మేరకు ఆ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఇంటర్ రీ వాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనుంది. ఏపీ ఎంసెట్ ఫలితాలను అప్పటి వరకు విడుదల చేయవద్దని తెలంగాణ ఇంటర్ బోర్డు ఏపీని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితాల విడుదల తేదీని త్వరలో తెలియజేస్తామని ఎంసెట్ కన్వీనర్ పేర్కొన్నారు.