పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.
వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ ఈసారి బడ్జెట్ లో ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవస్థలోని వేర్వేరు వాటాదారులతో చాలా సార్లు చర్చలు జరిపింది.
విద్య, ఆరోగ్య రంగం, క్యాపిటల్ మార్కెట్, ఉపాధి, నైపుణ్యాలతో పాటు MSME రంగాలకు చెందిన అధికారులు, ప్రతినిధులతో చర్చలు జరిపారు. పలువురు ఆర్థికవేత్తలతోనూ ఆర్థిక మంత్రి సమావేశమయ్యారు.
రానున్న బడ్జెట్ లో ద్రవ్యలోటు తగ్గింపుపై దృష్టి సారించాలని ఆర్థికవేత్తలు కేంద్రానికి సూచించారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలని రైతు సంఘాలు ఆర్థిక మంత్రిని కోరాయి.
ఈసారి కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే అవకాశాలు వున్నాయి అని అందరు ఆశిస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతోంది.
ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోదీ సహా కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోనూ ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో రాష్ట్రానికి గతానికంటే ఎక్కువ లబ్ది చేకూరేలా నిర్ణయాలు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.
మొబైల్ యాప్లో అందుబాటులో బడ్జెట్ పత్రాలు గతంలో లాగానే బడ్జెట్ 2024 కూడా పేపర్లెస్ ఫార్మాట్లో ఉండనుంది.
బడ్జెట్ పత్రాలు హిందీ, ఇంగ్లీష్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. కేంద్ర బడ్జెట్ కు సంబంధించిన అన్ని పత్రాలు ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’లో అందుబాటులో ఉంటాయి.

