ఏపీలో లాక్ డౌన్ ప్రకటించిన తరువాత నిత్యమూ ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు బయటకు వచ్చి ఏదో ఒకటి కొనుక్కుని వెళుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నిత్యావసరాలను రెండు నెలలకు సరిపడా కొంటున్నారని తెలుస్తుండగా, షుగర్, బీపీ వంటి వ్యాధి గ్రస్థులు ఇంట్లో ఉన్నవారు, వారికి అవసరమైన మందులను పెద్దఎత్తున కొనుక్కుంటున్నారు. దీంతో ఆయా మార్కెట్లలో రద్దీ ఎంతమాత్రమూ తగ్గడం లేదు.
లాక్ డౌన్ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిత్యావసరసరుకులు విక్రయించే దుకాణాలు, కూరగాయల మార్కెట్లు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టంగా చెబుతుండగా, వాస్తవ పరిస్థితుల్లో అది అమలు కావడం లేదు. ప్రభుత్వ ఆజ్ఞలను పక్కనబెట్టిన పోలీసులు కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9గంటలకే షాపులన్నింటినీ మూసివేయిస్తున్నారు. సీఐలు, ఎస్ఐ స్థాయి అధికారులు, తమ సిబ్బందితో వెళ్లి, షాపులను మూపిస్తున్నారు. దీంతో నిత్యావసరాలు, ఉదయం పూట కేవలం మూడు గంటలు మాత్రమే దొరకుతాయన్న నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. ఈ సమయంలోనే ప్రజలు అన్నిరకాల వస్తువులను ఒకేసారి కొనుగోలు చేయడంతో షాపులవద్ద రద్దీ విపరీతంగా పెరిగింది.