*హైదారాబాద్ ఫిల్మ్ ఫెడరేషన్ వద్ద టెన్షన్ వాతావరణం
*తెలుగు సినీ కార్మికులు సమ్మె..నిలిచి పోయిన షూటింగ్లు..
*కాసేపట్లో ఫిలించాంబర్ , నిర్మాతమండలి సమావేశం
*సమ్మె నోటీసులు ఇవ్వలేదంటున్న ఫిలించాంబర్
టాలీవుడ్లో సినీ కార్మికులు నేడు సమ్మెకు దిగారు. వేతన పెంపు కోరుతూ 20 వేల మందికి పైగా తెలుగు సినీ కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ వేతనాలు పెంచాలని సిని కార్మికులు గత కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నిర్మాతల మండలి స్పందించకోవడంతో సినీ కార్మికులు షూటింగ్స్కి హాజరు కాలేదు.ప్రతి మూడేళ్లకు ఒక్కసారి కార్మికుల వేతనాలు పెంచాల్సి ఉన్నప్పకీ.. నాలుగేళ్లు దాటినా వేతనాల ఊసే లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
దీంతో హైదరాబాద్లో పరిసరాల్లో 20కిపైగా షూటింగ్లు జరుపుకుంటున్న తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్లు నిలిచిపోయాయి.
అయితే దీనిపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని తెలుగు ఫిల్మ్ చాంబర్ కామర్స్ నూతన అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ అన్నారు. ఫడరేషన్ నుంచి తమకు ఎలాంటి సమ్మె నోటీసులు రాలేదని, ఒకవేళ కార్మికులు సమ్మె చేయాలనుకుంటే 15 రోజుల ముందు నోటిసుల ఇవ్వాలని తెలిపారు.
ఇదిలా ఉంటే అధ్యక్షుడు రామకృష్ణ వ్యాఖ్యలను సినిమా కార్మికుల ఫెడరేషన్ ఖండిచింది. ఈ నెల 6వ తేదినే చాంబర్కు సమాచారం ఇచ్చామని చెబుతూ ఫెడరేషన్ సభ్యులు తాము ఇచ్చిన లేఖను మీడియాకు అందించారు.
ఇదిలా ఉండగా కాసేపట్లో 24 క్రాఫ్ట్స్ సభ్యుల సమావేశం జరగునుంది. ఈ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ ముందు భారీగా పోలీసులు మొహరించారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాత్రమే ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. కార్మికులెవరు గుమిగూడవద్దని హెచ్చిరంచారు.