తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ జేఎన్టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ఉదయం ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్ట్ 4, 5,6 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించారు. 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మా కోర్సుల ప్రవేశాలకు ఎంసెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి చెందిన ర్యాంకులను మంత్రి సబిత విడుదల చేశారు. ఇంజినీరింగ్లో 82.07 శాతం విద్యార్థులు అర్హత సాధించగా… అగ్రికల్చర్, ఫార్మసీలో 98.48 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన విద్యార్థి కార్తికేయ మొదటి ర్యాంక్ సాధించాడు. 2వ ర్యాంకును కడప జిల్లా రాజంపేటకు చెందిన నరేష్ దక్కించుకున్నాడు. ఇక 3వ ర్యాంక్ హైదరాబాద్కు చెందిన మహ్మద్ అబ్దుల్ కైవసం చేసుకున్నాడు. నల్గొండ విద్యార్థి రామస్వామికి 4వర్యాంక్, హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన వెంకట ఆదిత్య 5వ ర్యాంక్ సాధించాడు.
అగ్రికల్చర్లో మొదటి ర్యాంక్ హైదరాబాద్కు చెందిన మండవ కార్తీకేయ సాధించగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీనిజ రెండో ర్యాంకును కైవసం చేసుకుంది.