తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో మాట్లాడిన కేసీఆర్.. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రైతుల సమస్యలను పక్కదారి పట్టించడానికే కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు.
కాశ్మీర్లో హిందూ పండిట్లను చంపినప్పుడు అధికారంలో ఉంది ఎవరు? అని ప్రశ్నించారు.. అప్పుడు బీజేపీ ప్రభుత్వమే అధికారంలో లేదా? అని నిలదీసిన కేసీఆర్.. కశ్మీర్ ఫైల్స్ను వదిలిపెట్టి మోదీ సర్కార్ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంపై అనేక విషయాల్లో కేంద్రం వివక్ష చూపిస్తోంది.
వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ ఇటీవల విడుదలైంది. కాశ్మీరీ పండిట్ల బాధను చెప్పే ఈ చిత్రంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా లేకపోలేదు.. దాదాపు 12 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూలు చేసింది.. ఈ చిత్రంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు కురిపించారు