కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి రైల్వేశాఖ దేశ ఆర్థికరంగంలో మహత్తరమైన పాత్ర పోషిస్తున్నదని పేర్కొన్నారు. హొసపేటె రైల్వేస్టేషన్లో హొసపేటె – హరిహర నూతన రైలును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాబోయే 10ఏళ్లల్లో రూ.50లక్షల కోట్ల నిదులను రైల్వే అభివృద్ధి కార్యక్రమాలకు రిజర్వు చేయనున్నట్లు తెలిపారు. నూతన పథకాల జోలికి పోకుండా ఇప్పుడున్న పథకాలను పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నట్లు తెలిపారు. 2022 కల్లా అన్ని పథకాలను పూర్తిచేసేందుకు ఆయా రాష్ట్రాలు తమవంతుగా రైల్వే పథకాల అమలుకు త్వరితగతిన భూములందించి సహకరించాలన్నారు.
ప్రజలు రైళ్లకోసం భూములివ్వడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని అన్నారు. అన్ని పథకాలు ప్రజాసేవలకే అన్నది దృష్టిలో ఉంచుకకొని తమకు సహకరించాలన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షలను రాయడంలో చాలా నిరాసక్తత చూపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పక్క రాష్ట్రాలైన ఆంధ్ర, మహారాష్ట్ర, తమిళనాడు విద్యార్థులు ఈ కాంపిటేటీవ్ పరీక్షలను ఎదుర్కొని ఉత్తమ ఉద్యోగాల్లో ఉన్నారన్నారు. రాబోయేరోజుల్లో పూనా- మీరజ్ – కొల్లాపుర, మహారాష్ట్ర – గోవా – కర్ణాటక, లోండా-హుబ్లి-దావణగెరె మూడు పథకాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటి హరిహర – హొసపేటె రైల్ను బళ్లారి వరకు పొడిగించడంపై రైల్వే అధికారి అజయ్కుమార్ సింఘ్తో చర్చించి నిర్ణయాలు తీసుకొంటామన్నారు.