ఏపీలో నేటి నుండి పింఛన్ పంపిణి ఉండటంతో, ఆయా పంచాయితీలకు కోట్ల కొద్దీ నగదు సరఫరా అవుతుంది. అయితే పెద్ద నోట్లు ఎక్కడ కనిపించకపోవడం విశేషం. అన్ని చిన్న నోట్లే కావడంతో వాటిని గోనె సంచుల్లో కట్టుకుని శుక్రవారం పంచాయతీ కార్యాలయాలకు తరలించారు. పెన్షన్ సొమ్ములు ప్రభుత్వం రెట్టింపు చేయడం, శనివారం నుంచి పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో ఒక్క అమలాపురం రూరల్ మండలంలోనే పంచాయతీ కార్యదర్శులు సుమారు రూ.3 కోట్ల మేర నగదును వివిధ బ్యాంకుల నుంచి డ్రా చేశారు.
వాటిలో రూ.2వేల నోట్ల జాడే లేదు. అధికశాతం రూ.10, రూ.20, రూ.50 నోట్ల కట్టలే. అక్కడక్కడా రూ.100 నోట్ల కట్టలు ఇచ్చారు. దాంతో నోట్ల కట్టలను తరలించేందుకు పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడగా, వాటిని పెన్షన్దారులకు పంపిణీ చేసేంతవరకు ఎక్కడ దాయాలో తెలియక తీవ్ర ఇబ్బందులుపడ్డారు. చివరకు వాటికి తామే రక్షణగా నిలిచి భద్రపరిచారు. కొన్ని పంచాయితీలలో వృద్దులు, ఇతరులు పెన్షన్ కోసం నాయకులు ఇంకా రాక పడిగాపులు కాస్తున్నారు. మొదటి రోజు కావటంతో ఆయా నేతల చేతుల మీదుగా కార్యక్రమం జరగాలని వారికోసం ఎదురుచూస్తున్నారు పంచాయతీ అధికారులు.