రైల్వే శాఖ దసరా సెలవులకు ప్రయాణికుల సౌకర్యార్థం జనసాధారణ రైళ్లని నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు నిత్యం సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని గుంటూరు సీనియర్ డీసీఎం డి.నరేంద్రవర్మ తెలిపారు. రెగ్యులర్, ప్రత్యేక రైళ్లలో టిక్కెట్లు బుకింగ్ చేసుకోలేకపోయినవారు ఈ జన సాధారణ రైళ్ల సేవలను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నెంబరు.07192 సికింద్రాబాద్- విజయవాడ జనసాధారణ రైలు ఈ నెల 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిత్యం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా మధ్యాహ్నం 3.05కి నడికుడి, 3.30కి పిడుగురాళ్ల, 4.03కి సత్తెనపల్లి, సాయంత్రం 5.20కి గుంటూరు, 5.55కి మంగళగిరి, రాత్రి ఏడుగంటలకు విజయవాడ చేరుకొంటుంది.
నెంబరు.07193 విజయవాడ- హైదరాబాద్ జనసాధారణ రైలు ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు నిత్యం రాత్రి 8.15 గంటలకు బయలుదేరి 8.45కి మంగళగిరి, 9.15కి గుంటూరు, 9.52కి సత్తెనపల్లి, 10.18కి పిడుగురాళ్ల, 10.46కి నడికుడి, అర్ధరాత్రి 1.40కి సికింద్రాబాద్, వేకువజామునకు ముందు 3గంటలకు హైదరాబాద్ చేరుకొంటుంది. ఈ రైళ్లలో 14 జనరల్ బోగీ లుంటాయని సీనియర్ డీసీఎం తెలిపారు.