telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రైతు కుటుంబానికి సోనూసూద్ ఆశ్వాసం – ఎద్దులు బహుమతిగా

ప్రముఖ నటుడు సోనూసూద్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా మహమ్మారి పీక్స్‌లో ఉన్న సమయంలో ఎంతో మందికి ఆయన సాయం చేశారు.

ఇప్పటికీ సాయం చేస్తున్నారు. అడిగిన వారికి.. అర్హులైన వారికి కాదనకుండా సాయం చేస్తున్నారు. తాజాగా, ఓ రైతు కష్టం చూసి సోనూసూద్ చలించిపోయారు.

ఆయనకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ రైతుకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

మహారాష్ట్ర, లాతూర్ జిల్లా, హదోల్తి గ్రామానికి చెందిన 76 ఏళ్ల అంబదాస్ పవార్ అనే రైతుకు పొలం ఉంది. ఆయనకు పొలం ఉన్నా.. ఖర్చు పెట్టి దాన్ని దున్నించేంత డబ్బు లేదు.

అందుకే భార్యా, భర్తలు కలిసి నాగలి లాంటి పరికరాన్ని తయారు చేసుకున్నారు. దాన్ని పొలానికి తీసుకెళ్లారు. భార్య నాగలి మేడితోక పట్టుకుంది.

ఆ వృద్ధ రైతు నాగలి కోలను మెడకు వేసుకుని లాగాడు. ఇలా ఇద్దరూ ఆ పొలం మొత్తం దున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నటుడు సోనూసూద్ దృష్టికి కూడా వెళ్లింది.

ఈ నేపథ్యంలోనే ఆ వృద్ధ దంపతుల కష్టం చూసి ఆయన చలించిపోయారు. వారికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

ఆ పోస్టులో .. ‘మన రైతు సోదరుడికి ట్రాక్టర్ నడపటం రాదు. అందుకే ఎద్దులు గిఫ్ట్‌గా ఇస్తాను’ అని అన్నారు.

సోనూసూద్ తమకు ఎద్దులు గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని తెలిసి ఆ వృద్ధ దంపతులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో సైతం సోనూసూద్‌పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

Related posts