అజిత్ పవార్ పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో అజిత్ పవార్ టచ్ లో ఉన్నట్టు తనకు మాత్రమే తెలుసని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇటు కాంగ్రెస్, శివసేనతో పాటు మరోవైపు బీజేపీతో కూడా ఎన్సీపీ చర్చలు జరిపిందని తెలిపారు. అయితే, కాంగ్రెస్ నాయకుల తీరు పట్ల అజిత్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. ఇదే ఆయన తిరుగుబాటుకు కారణం అయి ఉండవచ్చని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ మరికొన్ని పదవుల కోసం డిమాండ్ చేసిందని… అది నచ్చక సమావేశం నుంచి తాను వెళ్లిపోయానని… తనతో పాటు అజిత్ కూడా బయటకు వచ్చేశారని శరద్ పవార్ తెలిపారు. అదే రోజు రాత్రి ఫడ్నవీస్ తో అజిత్ మంతనాలు సాగించారని చెప్పారు. అయితే, అంత దూరం వెళతారని మాత్రం ఊహించలేకపోయానని అన్నారు. బీజేపీతో చేతులు కలిపి నవంబర్ 23న డిప్యూటీ సీఎంగా అజిత్ ప్రమాణస్వీకారం చేయడం చూసి తాను కూడా ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. బీజేపీతో అజిత్ చేతులు కలపడం చాలా మంది ఎన్సీపీ నేతలకు మింగుడుపడలేదని అన్నారు.