మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ-ఆర్కే అనారోగ్యంతో మృతి చేందినట్టు మావోయిస్టులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఛత్తీస్గఢ్లోని దక్షిణ బస్తర్ అడవీ ప్రాంతంలో అనారోగ్యంతో ఆయన అక్టోబర్ 14న ఉదయం 6 గంటలకు ఆర్కే మృతి చెందినట్టు పార్టీ ప్రకటించింది. కిడ్నీలు విఫలమై ఆర్కే చనిపోయారని తెలియజేసింది. పార్టీ శ్రేణుల సమక్షంలోనే ఆర్కే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్టు మావోయిస్ట్ పార్టీ తెలియజేసింది. చికిత్స అందించినా ఆర్కేను కాపాడుకోలేకపోయామని పార్టీ తెలియజేసింది.
1958లో ఆర్కే గుంటూరు జిల్లా పల్నాడులో జన్మించారు. 1980లో తొలిసారిగా పీడబ్ల్యూజీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 1982లో పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేసిన ఆర్కే 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఇక 1992లో రాష్ట్రకమిటీ కార్యదర్శిగా పనిచేశారు. దక్షిణ తెలంగాణ ఉద్యమంలో నాలుగేళ్లు పనిచేశారు. 2000లో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన ఆర్కే 2004లో ప్రభుత్వంతో చర్చలు జరిపిన బృందానికి నాయకత్వం వహించారు. చర్చల అనంతరం ఆర్కేను హత్యచేయడానికి ప్రయత్నించారని మావోయిస్టు పార్టీ పేర్కొన్నది.
కాగా..ఆర్కే మరణ వార్త విని.. ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు ఆర్కే భార్య శిరీష. అడవి చుట్టూ పోలీసులు చుట్టుముట్టి వైద్యం అందకుండా చేసి చంపేశారని ఆరోపించారామె. ఆర్కే.. ప్రజల కోసం పోరాడే గొప్ప యోధుడనీ.. అతని ఆశయాలను కొనసాగిస్తామనీ తెలిపారు. ఆర్కేకు జోహార్లు పలికారు. అర్కే అమర్ రహే అంటూ కన్నీటితో నినాదాలు చేశారు. ప్రజల కోసం జీవించిన మనిషికి.. వీరుల మధ్య అంత్యక్రియలు జరిగాయన్నారు శిరీష.