16 ఏళ్ల క్రితం పాత్రికేయుడు రామ్చందర్ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబా, గుర్మీత్రామ్ రహీమ్ సింగ్ తో పాటు మరో ముగ్గురు దోషులుగా సీబీఐ ప్రత్యేకకోర్టు తేల్చింది. ఆయనతో పాటు కుల్దీప్ సింగ్, నిర్మల్ సింగ్, కిషన్లాల్లను కూడా దోషులుగా చేస్తూ పంచ్కులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ తీర్పు వెలువరించారు. దోషులకు శిక్షను ఈ నెల 17న ఖరారు చేయనున్నారు.
తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రస్తుతం గుర్మీత్ 20 ఏళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్నారు. హరియాణాలోని రోహతక్ సొనారియా జైలులో ఉన్న ఆయన- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసు విచారణకు హాజరయ్యారు. దీంతో హరియాణాలోని డేరా ఆశ్రమం పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.