సౌదీరాజకుటుంబంలో 150 మంది కరోనా వైరస్ సోకినట్టు పలు అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు రావడం కలకలం రేపుతోంది. రియాద్ గవర్నర్ అయిన సీనియర్ యువరాజు ఫైసల్ బిన్ బండార్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ (70) కరోనా బారినపడి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
రాజకుటుంబంలో మరో 12 మందికిపైగా చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. అంతేకాదు మరెంతో మంది వైరస్తో పోరాడుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆ కథనం సారాంశం. రాజ కుటుంబానికి చికిత్స చేసే కింగ్ ఫైసల్ ఆసుపత్రిలో 500 పడకలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వ అధికారుల నుంచి ఆదేశాలు అందాయని, ఇది బయటకు రావడంతోనే వారు కరోనా బారినపడిన విషయం బయటకు వచ్చిందని పలు పత్రికలు వెల్లడించాయి.
వేలాది మంది వున్న సౌదీ రాజులలో చాలామంది క్రమం తప్పకుండా యూరప్ పర్యటనలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే వారికి కరోనా వైరస్ సంక్రమించి ఉంటుందని, వారి ద్వారా దేశంలోకి ప్రవేశించి రాజకుటుంబం మొత్తానికి సోకి ఉంటుందని భావిస్తున్నారు. 33 మిలియన్ల జనాభా గల సౌదీలో ఇప్పటి వరకు 2,932 కరోనా కేసులు నమోదుకాగా, 41 మంది మృతి చెందారు.